AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనం.. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కీలక వ్యాఖ్యలు

ఆ పార్టీలో మిగిలేది నలుగురే..
కాంగ్రెస్‌లో స్వేచ్ఛ.. అందుకే వెల్లువలా చేరికలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
త్వరలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆదర్ష్‌ నగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో హిమాయత్‌ నగర్‌ డివిజన్‌కు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పంపిణీ చేశారు. అనంతరం విలేకరుల మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్‌ కార్పొరేట్‌ కంపెనీలాగా నడిపారని, కేసీఆర్‌ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయిట్మెంట్‌ కూడా దొరికేది కాదని, ఒకవేళ దొరికినా.. గంటల తరబడి వెయిట్‌ చేయించేవారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, అందుకే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌పై నమ్మకం లేకనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు..
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని.. అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్‌ లో చేరుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో అందరికీ విలువ ఉంటుందని, గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఉండేదని, బీఆర్‌ఎస్‌ హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం అంటే అసలు ఫండే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.వేల కోట్లు దోచుకున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని అన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామని మేకపోతు గంభీర్యం చూపిస్తున్నారన్నారు. సొంత కుటుంబ సభ్యురాలు కవిత జైల్లో ఉంటే ఆమెను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ANN TOP 10