– బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక వేళ హాట్హాట్ చర్చ
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ బీజేపీ కొత్త రథ సారథి ఎంపిక వేళ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుపొంది జోష్ లో ఉన్న కమలం పార్టీలో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న అంశంపై పార్టీ నేతలు ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. ఓవైపు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుండగా.. కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పాత వాళ్లకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు.. కొత్త నీరు రావాల్సిందేనని మరికొందరు నేతలు డిమాండ్ చేయడం.. కొత్త, పాత నేతలు ఎవరికి వారే లాబీయింగ్ చేయడంతో కమలం రథసారథి ఎవరవుతారనే చర్చ ఆసక్తిగా మారింది. ఇలా తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి షురూ అయింది.. ఓవైపు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుండగా.. ఎంపీలు డీకే అరుణ, అరవింద్, రఘునంద¯Œ , ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పార్టీ సీనియర్ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, మురళీధర్ రావు, పేరాల చంద్రశేఖర్, ఆచారి లాంటివారి పేర్లు సైతం వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే.. దేశభక్తి, పార్టీ భక్తి, దైవభక్తి ఉన్నవాళ్లనే అధ్యక్షుడిగా నియమించాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీసింది.. రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటోనన్న విషయం పక్కన పెడితే.. తాజాగా ఇదే విషయంపై ఈటల రాజేందర్ స్పందించారు.
ఏ ఫైటర్ కావాలి.. స్ట్రీట్ఫైటరా.. రియల్ ఫైటరా.. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా.. అంటూ మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారన్న ఈటల.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు. తాను ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అన్నారు.
బీజేపీ కొత్త అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకొని వెళ్లే నేతను నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరిన నేపథ్యంలోనే.. ఇవాళ ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.