ప్రధానిగా మూడోసారి బాధ్యతల స్వీకరణ
‘కిసాన్ నిధి’ ఫైల్పై తొలి సంతకం
దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్ సెక్రటేరియట్ సౌత్ బ్లాక్లోని పీఎంవోలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులు విడుదల చేస్తూ ఫైల్పై తొలి సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దాదాపు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందనుంది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే రైతు సంక్షేమానికి సంబంధించిన ఫైల్పైనే తొలి సంతకం చేసినట్లు తెలిపారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
కాగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
మోదీ కేబినెట్ తొలి సమావేశం..
మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశమైంది. ఢిల్లీలోని లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో కేబినెట్ మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.