‘వరంగల్-ఖమ్మం-నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను ఒకే దగ్గర లెక్కిస్తున్నారు. 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో మొత్తం 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు. నల్లగొండ పట్టణ శివారులోగల ఎ దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములోని నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.
ముందుగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తుది ఫలితం రావడానికి దాదాపు 36 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన ప్రకటించారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కౌంటింగ్ కేంద్రం దగ్గర గుమికూడవద్దని ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు.
నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. సిబ్బంది 25 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపే లెక్కిస్తారు. బండిల్లు కట్టడం పూర్తయిన తర్వాత లెక్కింపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూడా ఏ అభ్యర్థికి గెలుపు కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెడతారు.
తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు.