కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో వేలాది మంది అమరులైంది ఎవరి వల్ల అంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల అని నిలదీశారు. ‘1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు? 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు? దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ? రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలి దేవత ఎవరు అంటూ’ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
