AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతాం.. సీఎస్‌ వార్నింగ్‌

రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎస్‌ శాంతికుమారి తెలిపారు. విత్తనాల పంపిణీలో ఏవిధమైన ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు.

వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనిఖీ చేయించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. గోదాములు, విత్తన విక్రయ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను అక్కడే నియమించాలని సూచించారు. జూన్ మాసాంతం వరకు విత్తన విక్రయాలు కొనసాగే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్లు ప్రతి రోజూ విత్తన పంపిణీలపై సమీక్షించడంతోపాటు విధిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాల లభ్యత సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియ చేయాలన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10