తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అందులోనూ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకల కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన రేవంత్ సర్కార్.. అదే రోజున రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ పాటను ప్రకటించేందుకు సరికొత్తగా స్వరపరుచుతోంది. కాగా.. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి.
అయితే.. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ మేరకు కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్కు, డైరెక్టర్ అరవింద్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సంబురాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు, వస్తువుల స్టాల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.