ఆదిలాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) చేసిన వ్యాఖ్యలపై ఏబీవీపీ నాయకులు (ABVP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా చౌరస్తాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ను ఏబీవీపీ నేతలు అడ్డుకున్నారు. పేపర్ లీకేజీ సర్వసాధారమంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీనిపై మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్పై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంతో ఓ వైపు ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ క్రమంలో పేపర్ లీకేజీలపై అధికారపార్టీ నేత, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పేపర్ లీక్లు సర్వ సాధారణంగా జరిగేవే అంటూ ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు. అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. గతంలో టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయని అనే విషయాన్ని గుర్తుచేశారు. పేపర్ లీక్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) దోషి అనడం సరి కాదన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలనడంలో అర్థం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ గ్రామంలో అధిక మార్కులు వచ్చిన వారి జాబితా సమర్పించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.