(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరు అధికారికంగా మారింది. టీఎస్ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ ఆర్టీసీగా (టీజీఎస్ ఆర్టీసీ) పేరు మార్చారు. అయితో సంస్థ లోగో కూడా మారినట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. దానిపై సంస్థ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవల అధికార ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇంతకు ముందు కేవలం వాహనాల నంబర్ ప్లేట్ల మీదే టీజీగా మారిన తెలంగాణ సంక్షిప్త పదం.. ఇప్పుడు అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ఆయా శాఖలు జారీ చేసే ఉత్తర్వుల్లో మార్చాలని ప్రభుత్వం రెండ్రోజుల ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇప్పటికే పలు శాఖలు పేరు మార్పు చేపట్టగా.. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా మార్చుతూ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
సంస్థ లోగోను కూడా మార్చినట్లు సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీని పోలిన విధంగా ఆ లోగో ఉంది. అయితే లోగో మార్పుపై సజ్జనార్ కీలక ప్రకటన చేసారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్ అని తేల్చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని.. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వెల్లడించారు. ఈ మేరకు సజ్జనార్ ట్వీట్ చేశారు.