ఆర్సీబీ కల చెదిరింది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో పరాజయం పాలైంది. బుధవారం (మే 22) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (34) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45), పరాగ్ (36), హెట్మయర్ (26) రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్ ఫైనల్ బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.
