అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తా
‘ప్రజల వద్దకే శ్రీనన్న’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి..
(అమ్మన్యూస్, ఖమ్మం):
ఇక ‘ప్రజల వద్దకే శ్రీనన్న’ కార్యక్రమంతో సమస్యలు పరిష్కరిస్తానని, మీ ఇంటి పెద్ద కొడుకుగా పనిచేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజలనుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యలపై ప్రజలు మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మీ అందరి దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచానని, తెలంగాణలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న పాఠశాల, రోడ్లు, కమ్యూనిటీ çహాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామన్నారు. పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని, ఎన్నికల కోడ్ ముగదియగానే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు. అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాని చెప్పారు. ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తనదన్నారు. భవిష్యత్లో ఏ సమస్య వచ్చినా ఇందిరమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.