తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం సీఎం రేవంత్ సహా కేబినెట్ మంత్రులు అందరూ వేచి ఉన్నారు. ఈసీ అనుమతి ఇస్తే సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక వేళ అనుమతి నిరాకరిస్తే కేవలం మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మొన్నటి వరకు అందరూ ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. అసెంబ్లీ ఫలితాల తరహాలోనే లోక్ సభ ఎన్నికల్లో కూడా రెండంకెల స్థానాలను గెలుపొందాలని సీఎం రేవంత్ ప్రయత్నించారు.
ఈ తరుణంలోనే దాదాపు మూడు నెలల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించలేదు. దీంతో పాలనపై తీసుకోవల్సిన కొన్ని నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. మే 18న కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దీనిపై సీఎస్ శాంతి కుమారి ఈసీని అనుమతి కోరారు. అనుమతి వస్తే ఈరోజు కేబినెట్ లో రైతు రుణమాఫీ, ఆదాయం పెంపు అంశాలపై చర్చ ఉన్నతస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వర్షాకాల సీజన్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు.