జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారని, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను శుక్రవారం బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారని విమర్శించారు. లాయర్కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేశారంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్ధం అవుతుందని అన్నారు.
రాత్రికి రాత్రి జడ్జిని మార్చారన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారని అడిగారు. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదని చెప్పారు. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవని.. అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. వాళ్ళ పేర్లు, వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారని ఆయన తెలిపారు.