ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, రానున్న నాలుగేళ్లలో ఐటీ రంగాన్ని విస్తృత అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్లో శుక్రవారం 2వ ఎడిషన్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐటీ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. దీనివల్ల ఉద్యోగాలతో పాటు.. పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్టుబడిదారులకు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని తెలిపారు.
ప్రతి పౌరుడు లబ్ధి పొందే విధంగా ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని చెప్పారు. 2003లో హరిత భావనాల నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైందని తెలిపారు. 20ఏళ్లలో క్రమంగా హరిత భవనాల నిర్మాణం జరిగితూ వస్తోందని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంపై అప్పటి మన్మోహన్ సర్కారు కఠిన చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారాయన. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేదుకు ఆకస్మిక తనిఖీలు చేశానని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.