కురుకురే ప్యాకెట్ ఓ కాపురంలో చిచ్చు పెట్టింది. భర్త తన కోసం కుర్కురే ప్యాకెట్ తీసుకురాలేదన్న కారణంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. ఐదు రూపాయల కురుకురే విడాకులకు కారణమైంది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది. ఆమెకు రోజూ కుర్కురే తినడం అలవాటు. కొన్నాళ్లు భర్త కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. అయితే, జంక్ఫుడ్ రోజూ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అది ఇరువురి మధ్య గొడవకు కారణమైంది. అయినప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చే భర్త.. ఆ కుర్కురే ప్యాకెట్ ఒకరోజు తీసుకువెళ్లడం మర్చిపోయాడు. దీంతో పెద్ద రచ్చ రచ్చ చేసింది అతని భార్య.
ఈ క్రమంలోనే కోపంతో పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి భర్త తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ విడాకులు ఇప్పించాలని కోరింది. దీంతో స్పందించిన పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించాలని నిర్ణయించారు.