ఆంధ్రప్రదేశ్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్ కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి (CEO) ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు. సోమవారం ఎన్నికలు పోలింగ్ ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల సరళిని వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటును వినియోగించుకోవడం శుభపరిణామని అన్నారు.
రాష్ట్రంలో పలు పోలింగ్ కేంద్రాల్లో 275 బ్యాలెట్ యూనిట్, 600వీవీ ప్యాట్స్ (VV Pats) లో సమస్యలు రాగా సాంకేతిక నిపుణులతో వాటిని సరిచేయడం, తమ వద్ద ఉన్న అదనపు మెషిన్ పంపించి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 8 పోలింగ్ యూనిట్లను అన్నమయ్య జిల్లాలో కోడూరు, దర్శిలో 3 ఈవీఎం (EVMs) లు ధ్వంసం చేశారని, ధ్వంసానికి గురైన యంత్రాల్లో అమర్చిన చిప్లు భద్రంగా ఉన్నాయని తెలిపారు. ఇక్కడ వాటి స్థానంలో మరో మిషన్లు ఏర్పాటుచేసి తిరిగి ఎన్నికలను కొద్ది గంటల్లోనే తిరిగి ప్రారంభించామని వివరించారు.
ఓటరు జాబితాలో తమ పేర్లు లేవని తక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పల్నాడు, అనంతపురం, తెనాలిలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని తెలిపారు. తెనాలిలో ఓటర్ను కొట్టిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని తెలిపారు. పోలింగ్ ముగిసిన 6 గంటల తరువాత కూడా రాష్ట్రవ్యాప్తంగా 3, 500 పోలింగ్ కేంద్రాల్లో వంద నుంచి రెండు వందల మంది, మరో 60 కేంద్రాల్లో మూడు వందలకు పైగా మంది ఓటర్లు క్యూలైన్లో నిలబడ్డారని తెలిపారు. మొత్తానికి రాత్రి 10 గంటల వరకు పోలింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.









