AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంక్రాంతి రికార్డును బ్రేక్‌ చేసిన ఆర్టీసీ.. మూడు రోజుల్లోనే 1.42 లక్షల మంది జర్నీ

సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్‌ఆర్టీసీ బ్రేక్‌ చేసింది. సంక్రాంతి సీజన్‌తో పోలిస్తే 10 శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఇక ఏపీకి 59,800 మంది ప్రయాణించారని తెలిపారు.

కాగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఏపీ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టింది. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీఎస్‌ఆర్టీసీ కోరింది.

అలాగే, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రయాణికులను ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరింది.

ANN TOP 10