కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఆ వీడియోను తాను షేర్ చేయలేదని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు. ఐఎన్సీ తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని.. తాను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను (CMO తెలంగాణ, వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని వెల్లడించారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్తా బుధవారం ఢిల్లీ పోలీసులకు అందజేశారు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, స్టేట్ సెక్రటరీ శివకుమార్, స్పోక్స్ పర్సన్ అస్మా తస్లిమ్, నవీన్కు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ గాంధీభవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మే 1న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్నందున తనకు నాలుగు వారాల గడువు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మిగతావారు తమకు 15 రోజుల గడువు ఇవ్వాలని విన్నవించారు.
కేసులకు భయపడను: సీఎం రేవంత్
కాగా, తాను కేసులకు భయపడేవాడిని కాదని కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనను కేసీఆర్ చంచల్ గూడ జైలులో బంధిస్తే భయపడ్డానా అని ప్రశ్నించారు. బీజేపీ దగ్గర ఈడీ, ఐటీ, సీబీఐ ఉంటే తన దగ్గర ప్రజలున్నారని ఆయన అన్నారు.









