శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. చిరుతను పట్టుకునేందుకు అధికారులు రెండురోజులుగా శ్రమిస్తున్నారు. ఆదివారం చిరుత ఫెన్సింగ్ దూకుతుండటం కెమెరాలో రికార్డు అయ్యింది. 7 అడుగుల ఎత్తయిన గోడ దూకి చిరుత రన్వే పైకి వచ్చినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు ఆదివారం 3 ట్రాప్ కెమెరాలు, ఒక బోను ఏర్పాటు చేసిన అధికారులు, సోమవారం మరో 6 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
బోన్ లో మేకను ఉంచి పులిని బంధించేందుకు ప్లాన్ వేశారు అధికారులు. కాగా, మొన్న సంచరించిన ప్రాంతంలోనే ఆదివారం రాత్రి చిరుత సంచరించినట్టు గుర్తించారు. అక్కడ సమీపంలో నీటికుంట ఉందని, బహుశా నీటికోసం చిరుత వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మళ్లీ అదే ప్రాంతానికి చిరుత వచ్చే అవకాశం ఉందని, చిరుతకు రెండేళ్లు వయసు ఉంటుందని తెలిపారు.