AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోడీ అంటే మోసం.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

సోమవారం కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. స్థానిక నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొనసాగినట్టు తెలిపారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే, ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రజలతో అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్న రేవంత్, ఐదు గ్యారెంటీలను ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలు చేసుకున్నామని చెప్పారు. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారని, 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ, ఒక్క పైసా కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. గతంలో కర్ణాటక నుంచి 26 ఎంపీలను ఇస్తే, మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఒక్క కేబినెట్ పదవి మాత్రమేనని అన్నారు.

‘‘మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు. ఖాళీ చెంబు తప్ప. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారు. అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ను గెలిపించండి. లక్ష మెజారిటీతో ఇక్కడ పార్టీని గెలిపించండి’’ అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ANN TOP 10