(అమ్మన్యూస్, సిద్దిపేట):
కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లబ్ధి చేకూరుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ విశాల జన సభ పేరిట ఎన్నికల ప్రచార బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పది సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో పరిష్కరించినట్లు తెలిపారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రంను ఏటీఎంగా మార్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే అన్నారు. కాలేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు విచారణ జరపలేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో పక్షం రోజుల సమయమే ఉండడంతో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసింది. ఆయా సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం తరలివస్తోంది. మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేట సభలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.