లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు గురువారం ముగియనుండగా మంగళవారం నాటికి మొత్తం 478 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ర్టానికి సాధారణ, శాంతి భద్రతల, ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. వీరు గురువారం ఆయా నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోనున్నారు. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు, శాంతిభద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు, వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్, ఐటీకి చెందిన అధికారులను నియమించారు. వీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి, రాజకీయ పార్టీల ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు.
పోలింగ్ కేంద్రాలకు మే 12న సెలవు
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12న, జూన్ 4న సెలవుదినాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ఆయా విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలకు ముందురోజు కూడా సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో మే 12న సెలవు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నది.