రేవంత్.. అందుకే నాపై కక్ష పెంచుకున్నారు
ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పలు అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాటకాలు తెలిసిపోయాయని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని అన్నారు.
‘కేసీఆర్ ఆనవాళ్లను తీసేస్తామని రేవంత్ అన్నారు.. మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టిందే.. యాదాద్రి ఆలయం కట్టింది నేనే కూలగొడతారా..? కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. నా ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదు.. ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారు’ అని మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసులో రేవంత్ పట్టుబడ్డారని.. తెలంగాణను అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేశారంటూ కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణను ఎడారి చేసేందుకు కాంగ్రెస్ చూస్తుందని.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించనంటూ కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసమే పనిచేశారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఢోకాలేదన్న కేసీఆర్
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం నుంచి రిపేర్ వరకు కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 50 వేల మంది రైతులను తీసుకెళ్లి ధర్నా చేస్తానని.. ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేర్ చేయిస్తా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రూ.100 కోట్లతో పిల్లర్లను రిపేర్ చేయొచ్చు.. కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ని రిపేర్ చేయకపోయినా.. వందేళ్ల వరకు మిగతా బ్లాక్లు పదిలంగా ఉంటాయన్నారు కేసీఆర్. మహానదులపై కట్టే ప్రాజెక్టుల్లో లోపాలు సహజమని.. తెలంగాణకు నీళ్లు తేవాలని మాత్రమే చూశామని కానీ, తనను బద్నాం చేయాలని కాంగ్రెస్ నీళ్లు వదల్లేదన్నారు.
కాంగ్రెస్ పాలకులు రైతుల పంటలను ఎండబెట్టారని కేసీఆర్ మండిపడ్డారు. ఉత్తమ్కుమార్ దారుణంగా మాట్లాడారని.. చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు. ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేర్ చేయిస్తా అంటూ స్పష్టంచేశారు కేసీఆర్. తెలంగాణపై సమైక్యపాలకులు వివక్ష చూపారని.. ఒక్క ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేయలేదని కేసీఆర్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ 85 మీటర్ల ఎత్తులో ఉంటుంది.. సమ్మక్క బ్యారేజీ దగ్గర 70 మీటర్ల ఎత్తు ఉంది.. సీతమ్మసాగర్ దగ్గర 47 మీటర్ల ఎత్తు ఉందని తెలిపారు. కాకతీయులు 75 వేల చెరువులు నిర్మించారు. నిజాంరాజులు కూడా చెరువులను కొనసాగించారన్నారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ తాను చేయలేదని.. తనకు ఇంజినీరింగ్ భాషే తెలియదంటూ కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ అవసరాలకు తగ్గట్టు రీడిజైన్ చేశామని.. సమైక్యపాలనలోనే ఎత్తిపోతలకు అనుమతులు.. దశలవారీగా నీటిని ఎత్తిపోసేలా ప్లాన్ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు ఎలాంటి ఢోకా లేదన్నారు కేసీఆర్. కాళేశ్వరంలో 200 కి.మీ అండర్ టన్నెల్స్ ఉన్నాయి.. ఎ-గ్రేడ్ ప్రాజెక్ట్ అని సర్టిఫికెట్ వచ్చిందని కేసీఆర్ తెలిపారు.
మేడిగడ్డకు సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చు. వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు. మేడిగడ్డలో 80కి పైగా గేట్లు ఉన్నాయి. కాళేశ్వరం నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు. 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టామని.. 200 టన్నెల్స్ క్షేమంగా ఉన్నాయన్నారు. రిజర్వాయర్స్, 1500 కి.మీ కాలువలు బాగున్నాయని కేసీఆర్ తెలిపారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కొద్దిగా పగుళ్లు వచ్చాయన్నారు. నిర్వహణ కోసం ఈఎన్సీని కూడా నియమించామని కేసీఆర్ తెలిపారు. రూ.4 వేల కోట్లతో 1200 చెక్డ్యామ్లు నిర్మించామని కేసీఆర్ వివరించారు.
కవిత కడిగిన ముత్యంలా వస్తారు: కేసీఆర్
తమ సర్కారు ఉన్నప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ వచ్చారని కేసీఆర్ తెలిపారు. మ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ సూత్రధారి అని అన్నారు. సంతోష్పై కేసు పెట్టామని కక్ష కట్టి తన కూతురు కవితపై అక్రమ కేసు పెట్టించారని కేసీఆర్ ఆరోపించారు. ఫలితం అనుభవించక తప్పదన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎలాంటి రికవరీలు లేకుండానే అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, అంతా మోడీ సృష్టేనని కేసీఆర్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. నా కూతురు కవితకు ఏమి తెలియదని, లిక్కర్ స్కామ్తో కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో తాను పోరాడుతున్నానని, నా కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు కేసీఆర్.
మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అవుతా: కేసీఆర్
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ తానే ముఖ్యమంత్రిని అవుతానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీల కారణంగానే తాము ఓడిపోయామని అన్నారు. ఏదీఏమైనా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తానే సీఎంను అవుతానని కేసీఆర్ చెప్పుకొచ్చారు.