వేలాదిగా పాల్గొన్న భక్తులు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర మొదలైంది. గౌలిగూడ నుంచి తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి కాచిగూడ, నారాయణ గూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బన్సీలాల్ పేట్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర సాగనుంది. దాదాపు 13 కిలో మీటర్ల మేర శోభాయాత్ర కొనసాగునుంది. శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
మరోవైపు శోభాయాత్రకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీస్తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ను మళ్లించారు. దాదాపు 44 చోట్ల ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని.. ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్లాలని పోలీసులు సూచించారు. జై హనుమాన్.. జై శ్రీరామ్ అంటూ భక్తుల నినాదాలతో శోభాయాత్ర కొనసాగింది.