ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జీవనం విలక్షణం
(అమ్మన్యూస్, ఖమ్మం):
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జీవనం విలక్షణం. ప్రజాసేవే లక్ష్యంగా పల్లెల ప్రగతే ముఖ్యంగా భావిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవకు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు. రాముడి సేవకు, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడిన వంశం వారిది. వీరి స్వగ్రామం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం తిమ్మంపేట. 1930లలో వినోద్ రావు తాత అయిన సుదర్శన్ రావు భద్రాచలం రాములవారి ఆలయానికి ట్రస్టీ గా ఉండేవారు. ఆ హోదాలో ముత్యాల తలంబ్రాలు సమర్పించే వారు. వారు ఆ రోజుల్లోనే మున్షీ వరకు చదివారు. వినోద్ రావు తండ్రి కృష్ణారావు వకీల్ రావుగా పాల్వంచ ప్రాంతంలోనే కాకుండా జిల్లాలో పేరు పొందారు. వీరి పెదనాన్న టీ వీ నరసింహా రావు జడ్జి గా పనిచేశారు.
మాతృభూమి ప్రేమతో..
వినోద్ రావు ఇంటర్ వరకూ పాల్వంచలో చదువుకున్నారు. డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. అమెరికా లో మంచి ఉద్యోగం చేసినా, స్థిరపడడానికి మంచి అవకాశం ఉన్నా మాతృ భూమి మీద ప్రేమతో, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తిరిగివచ్చారు. వినోద్ రావు గత దశాబ్దానికి పైగా సోషల్ వర్కర్ గా పలు స్వచ్ఛంద సంస్థ లలో ఉన్నత బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పేదలకు సేవ చేశారు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే 2015 నుంచి 2021 వరకూ ఏకలవ్య ఫౌండేషన్ తరఫున విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం వంటి రంగాల్లో సేవలందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వారి నాయకత్వంలోని ఫౌండేషన్ అద్భుతమైన సేవ చేసింది.
గిరిజనుల అభివృద్ధి కోసం..
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లో గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన కృషి పలువురి ప్రసంశలు అందుకుంది. ప్రత్యేక విద్యా కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల్లో 24 జిల్లాల్లో బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్నారు. డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ గా 2017 నుంచి జనవరి 2024 ఆయన అందించిన అద్భుత సేవలు ప్రశంసలు అందుకున్నాయి. ముప్పేట దాడికి గురవుతున్న హిందూ సమాజ సేవకు వీరు నడుం బిగించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకు పోవడంతో స్ఫూర్తి పొంది, ఈ మహా క్రతువులో తన వంతు పాత్ర పోషించేందుకు, ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ప్రజా సేవ కొనసాగించేందుకు ఉత్సుకతతో ఉన్నారు.