ప్రముఖ సినీ నటుడు రఘుబాబు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు బైక్ ని ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదు చేశారు టూటౌన్ పోలీసులు. ఈ కేసులో రఘబాబును అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్ పై సినీ నటుడు రఘుబాబు రిలీజ్ అయ్యారు.
రఘుబాబు ప్రయాణిస్తు కారు బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావు స్పాట్ లోనే చనిపోయారు. ఈ కేసులో నల్గొండ టూటౌన్ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే బెయిల్పై విడుదలయ్యారు రఘుబాబు.
బీఆర్ఎస్ నేత సందినేని జనార్దన్ రావు.. కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఘోరం జరిగిపోయింది. హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న BMW కారు జనార్దన్ రావు వెళుతున్న బైక్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయన మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మృతుడు జనార్దన్ రావు భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.