(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. దీంతో రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద శరత్ చంద్ర రెడ్డి వాగ్మూలం ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా రికార్డు చేశారు.
కాగా గతంలో ఈడీ కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసూలోనూ అప్రూవర్ గా మారారు. కాగా ఇదే కేసులో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరిచిన తర్వాత శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రా రెడ్డి దక్కించుకున్న ఐదు జోన్లకు ఒక్కొక్క జోన్ కి రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ.25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్ర రెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరించినట్లు సీబీఐ చెప్పింది. కవితను రెండు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ప్రత్యేక కోర్టు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ కి పంపింది. జ్యుడీషియల్ రిమాండ్ కి ఇచ్చిన నాలుగు రోజుల్లో సీబీఐ కేసులో అప్రూవర్ గా శరత్ చంద్ర రెడ్డి స్టేట్ మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.