AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను హైటెన్షన్ వైర్ ను.. తాకితే మసైపోతారు.. కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాలం చెల్లిందని.. కారు షెడ్డుకు పోయిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి. ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో లెక్క పెట్టుకో’’ అని కేసీఆర్‌కి రేవంత్ సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరికాసేపట్లో మహబూబ్‌‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ తీశారు. ఈ సభలో బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

నన్ను ముట్టుకుంటే మాడిపోతారు…
2009 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గెలిపించారని.. గెలిపిస్తే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో కేసీఆర్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని నిలదీశారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సహకరించలేదన్నారు. పరిశ్రమలను జిల్లాకు తీసుకురాలేదని.. కానీ మళ్లీ కేసీఆర్ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పార్లమెంట్‌లో పాలమూరు గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును బొంద తీసి పాతి పెట్టారని ఎద్దేవా చేశారు. కారును తూకం పెట్టి అమ్ముడేనని సెటైర్లు గుప్పించారు. రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ అని.. ముట్టుకుంటే మాడిపోతారని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వమని.. స్వయం సహాయక బృందాలతో మహిళా సంఘాలను ఆదుకున్నామని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణ సాధిస్తాం…
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు నిధులను తీసుకువచ్చి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ దొరలు – గద్వాల గడీల దొరసాని ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరుకి సువర్ణ అవకాశమొచ్చిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సాధించే బాధ్యత తమదని తెలిపారు. పాలమూరులోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించాలని.. జిల్లాను మరింతగా అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు.

డీకే అరుణ జిల్లాకు ఏం చేశారు..?
బీజేపీ నేత డీకే అరుణ జిల్లా అభివృద్ధికి కృషి చేయలేదని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. 100 రోజులు కాకమునుపే ప్రభుత్వాన్ని కూలదోయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

ANN TOP 10