మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ యత్నించిందని వ్యాఖ్యానించారు. అలాగే 64 మందే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని బతకనిస్తుందా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదేనని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. గట్టిగా పోరాడితే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని, అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు తనతో వాపోయాడని వ్యాఖ్యలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడని, ఇప్పుడే వద్దని వారించానని చెప్పార. కాంగ్రెస్లో టీమ్ వర్క్ లేదని, స్థిరత్వం లేదన్నారు. ఇప్పటి వరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని, మరో మూడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
