అమ్మన్యూస్ ప్రతినిధి, ఆదిలాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ వేదికగా మాట్లాడిన మాటలను, సీఎం రేవంత్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పదే పదే బీజేపీలో చేరుతారని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు. అధికారం కోల్పోయాక జీర్ణించుకోలేకనే అసహనంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బీఆర్ ఎస్, బీజేపీల వైఖరిని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. వెనుకబాటుకు గురైన ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని పనిగట్టుకుని బాద్నాం చేయాలని చూస్తే ఊరుకోబోమని, తమ తడాఖా చూపిస్తామని అన్నారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టి నిజమైన తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని బీఆర్ఎస్ కాదా అంటూ నిలదీశారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..
వాస్తవంగా బీజేపీతో దోస్తానా చేసిందే బీఆర్ఎస్ అంటూ ఆయన వ్యాఖ్యనించారు. కేంద్రంలో బీజేపీ నట్టచట్టాలు తీసుకొచ్చినప్పుడు మద్దతు తెలిపి మౌనం వహించింది మీరు కాదా అంటూ ఆగ్రహించారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే మౌనం వహించారన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత భరించలేకనే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రెండు లక్షల రుణమాఫీ ఏమైందంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని, ఒక్కోక్కటిగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇప్పుడు హామీలను నెరవేర్చడంలేదని ఉల్టా చోర్ కొత్వాల్కు డాటే అన్న చందంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్పై అబండాలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు. ఇప్పటికీ అనేక ఆదివాసీ గిరిజన గ్రామాలు, మారుమూల పల్లెల్లో తాగునీటికి కష్టాలు తప్పడంలేదన్నారు. మిషన్ భగీరథ పేరు మీద కోట్ల రూపాయలు కమీషన్లు తీసుకుని ఇంటింటికీ నల్లా నీటిని అందించామని గొప్పలు చెప్పుకోవడం బీఆర్ఎస్కే చెల్లిందని ఘాటుగా విమర్శించారు. నిజంగా నీటి సమస్యకు పరిష్కారం చూపి ఉంటే పల్లెల్లో తిరుగుదామని, అదే నిజమైతే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చేసిన తప్పిదాలను కప్పిపుచ్చు కోవడానికే కాంగ్రెస్పై లేనిపోని ఆరోపణలు చేసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ లబ్దిపొందడానికి యత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసేందేమీలేదని, వారికి ఓట్లు వేసి మళ్లీ మళ్లీ మోసపోవద్దని తెలిపారు. పేద బిడ్డలను చట్టసభలకు పంపిస్తే ప్రజల గొంతుకగా తమ వాణి వినిపిస్తామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, బొల్లారం బాబన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే, ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ షెడ్మకి ఆనంద్ రావు, కౌన్సిలర్ జాఫర్ అహ్మద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, భరత్ వాగ్మారే, శ్రీలేఖ ఆదివాసీ, నాగర్కర్ శంకర్, కళ్లెం భూమారెడ్డి, బండి దేవిదాస్ చారి, దుర్గం శేఖర్, గంటుబాయి, రాజ్ మహమ్మద్, జంగు పటేల్, ఖయ్యుమ్, ఇర్ఫాన్ ఖాన్, బూర్ల శంకరయ్య, సంజీవ్ రెడ్డి, మహిళా నాయకులురాలు లత, లక్ష్మి, ఉయిక ఇందిర, జుబేద, జబీనా, సోనియా, మంథని, అలీం, సలీం, జగదీశ్వర్రెడ్డి భారీసంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.