(అమ్మన్యూస్,హైదరాబాద్):
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోంది. ఇందులో సినిమా సెలబ్రిటీల నుంచి, ప్రముఖ రాజకీయ నాయకుల వరకు అందరూ ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తుండటంతో ఒక్కొక్కరుగా బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై స్పందించారు.
తెలంగాణలో తాను గవర్నర్ గా పనిచేసే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపించారు. దీనిపై 2022 లో తాను స్పందించాను.. కానీ అప్పుడు నేను రాజకీయాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తన ఆరోపణలను తోసిపుచ్చింది.. గతంలో తాను చెప్పిందే ఇప్పుడు నిజమవుతుందని.. తమిళిసై బుధవారం ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతంలో తెలంగాణ గవర్నర్ ఉన్న ఆమె.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె సౌత్ చెన్నె నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.