ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని కల్పర్ అడవిలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ తోపాటు మరో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ కాంకేర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. కాంకేర్ లోక్సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
