చిన్నప్పరెడ్డికి ఇచ్చే అవకాశం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో గులాబీ దళపతి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా నల్గొండ ఎంపీ అభ్యర్థిని బీఆర్ఎస్ మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా ఇక్కడి అభ్యర్థి కొంత బలహీనంగా ఉన్నారని, అభ్యర్థిని మారిస్తేనే పోటీలో నిలుస్తామని బీఆర్ఎస్ భావిస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ నిర్వహించిన సర్వేలో కృష్ణారెడ్డి వెనుకపడ్డారని తెలుస్తోంది. ఆయన ఏకంగా మూడో స్థానంలో ఉన్నారని.. ఇలా అయితే ఈ నియోజకవర్గంలో పోటీ ఇవ్వలేమని, అభ్యర్థిని మారిస్తే పోటీలో ఉండొచ్చనే ఆలోచన గులాబీ బాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నప్పరెడ్డిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థి మార్పుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నప్పరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా ఇంకా ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకువస్తారా అనేది తెలియాల్సి ఉంది.