(అమ్మన్యూస్, హైదరాబాద్):
కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారం కోల్పోయి.. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది బీఆర్ఎస్. ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు మనుగడ సాగించి.. పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం చూసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలోనూ పట్టు సడలకుండా అధినేత కేసీఆర్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు.
సీఎంగా ఉన్న సమయంలో ప్రగతిభవన్- ఫాంహౌస్ కు తరచూ రాకపోకలు సాగించే కేసీఆర్.. అధికారం కోల్పోయిన తర్వాత మకాం నందినగర్కు మార్చారు. కాగా, ఇప్పుడు కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. అలాంటి ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖాళీ స్థలంలో క్షుద్రపూజలు జరిగినట్లు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు… ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా క్షుద్రపూజలు చేసిందెవరో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు చేశారు ? ఎప్పుడు చేశారు ? ఎవరు చేయించారు ? ఎవరి కోసం చేశారు ? నిత్యం సెక్యూరిటీ ఉండే.. కేసీఆర్ ఇంటిపక్కనే.. అందులోనూ హైదరాబాద్ లో క్షుద్రపూజలు చేయడం ఎలా సాధ్యమైంది ? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా, క్షుద్రపూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసీఆర్ కు దైవభక్తి చాలా ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే.