దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు. ‘కవిత ఏం చెప్పాలనుకున్నా.. విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలి. అంతేకానీ ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడటం మంచిది కాదు. మీ క్లయింట్ కవితకు అలా మాట్లాడవద్దని వివరంగా చెప్పండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కోర్టు బయట మాట్లాడాలి తప్ప.. కోర్టు ఆవరణలో, కారిడార్లలో మాట్లాడవద్దని ఆ విధంగా సూచించండి’ కవిత లాయర్ మోహిత్రావుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇవన్నీ నిశితంగా విన్న మోహిత్ రావు.. సూచనలన్నింటినీ కవితకు చెబుతానని న్యాయమూర్తికి తెలిపారు.
మళ్లీ కస్టడీ.. జైలుకే!
కాగా.. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కవిత బెయిల్ పిటిషన్పై దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. కవిత బెయిల్ పిటిషన్పై ఈనెల 22 ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా వెల్లడించారు. కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో కవితను మరోసారి సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు.