సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పరిశ్రమ డైరెక్టర్ రవితోపాటు కార్మికులు నలుగురు దుర్మరణం చెందారు. తాజాగా మరో కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద మరో కార్మికుడిని పోలీసులు గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్గా గుర్తించారు. ఘటనా స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారని గాలిస్తున్నారు. కాగా, మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
