మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని అన్నారు. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల కరువు వచ్చిందన్నారు. అలాగే యాదగిరి గుట్టలో భారీ స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత విచారణ చేస్తామని తెలిపారు. అంతేగాక యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని చెప్పారు. యాదగిరి గుట్టలో కూడా స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత విచారణ జరిపిస్తామన్నారు. గేట్లు తెరవకముందే కాంగ్రెస్లోకి తోసుకుని వస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పుకొచ్చారు. అదే విధంగా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు, బీజేపీకి మధ్యే పోటీ అని అన్నారు. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి బేధాలు లేవని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత హరీశ్ రావు బీజేపీలో చేరుతాడని కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలే అయిందని, మాపై దాడి చేయడం కేకే లాంటి సీనియర్ నేతలకు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తామన్నారు. నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రతీది రాజకీయం చేయడమే కేసీఆర్ పని.. ఫోన్ ట్యాపింగ్ చిల్లర పని అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.