మా నాన్నకు 85 ఏళ్లు.. ఎలా కాంగ్రెస్లోకి తీసుకుంటారు?
కేశవరావు కుమారుడు విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
కే.కేశవరావు తనయుడు, బీఆర్ఎస్ నాయకుడు విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కే. కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పార్టీ మారడంపై ముమ్మాటికీ తప్పేనని అన్నారు. శుక్రవారం తనను కలిసిన సన్నిహితులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి బీఆర్ఎస్ పార్టీని ఈ పరిస్థితుల్లో వీడడం మంచిది కాదని అన్నారు. ‘రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు నిర్వహించి తెలంగాణకోసం కేసీఆర్ నాయకత్వంలో కేకే పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉంది.. బీఆర్ఎస్ లో కొనసాగితే బాగుండేది’ అని అన్నారు.
రాజకీయంగా ఒత్తిళ్లు ఉండొచ్చు..
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదన్నారు. పదేళ్ల తరువాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లోనే బీఆర్ఎస్ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇదేమి రాజకీయమో అంటూ విప్లవ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. కేశవరావుపై రాజకీయంగా ఒత్తిళ్లు ఉండొచ్చు. కానీ, పదవులకోసం మా నాన్న పార్టీ మారడం మంచిదికాదన్నారు.
కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరగలేదు..
పార్టీ మారే అంశంపై కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ చర్చ జరగలేదని విప్లవ్ కుమార్ అన్నారు. మా సోదరి విజయలక్ష్మికి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ మేయర్ గా అవకాశం కల్పించింది. ఇంతకంటే పెద్ద పదవి ఇంకా ఏముందని విప్లవ్ ప్రశ్నించారు. పదవికోసమే రాజకీయాల్లో కొనసాగుతామనడం భావ్యంకాదు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని మేయర్ చెప్పడం ప్రభుత్వాన్ని విమర్శించడమే అవుతుందని విప్లవ్ అన్నారు.
నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతా..
నేను కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. ఉద్యమ సమయం నుంచి తెలంగాణ వాదిగా గుర్తింపు ఉంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను, మళ్లీ మేము అధికారంలోకి రావడం ఖాయంమని విప్లవ్ అన్నారు. బీజేపీ ఇద్దరు ఎంపీల నుంచి 300కుపైగా ఎంపీలను గెలుచుకోలేదా? బీఆర్ఎస్ పార్టీపై గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లడం రాజకీయంగా సరైన నిర్ణయం కాదని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారో అందరికీ తెలుసన్నారు. కేకేకు ఇప్పుడు 85 సంవత్సరాలు.. ఎలా కాంగ్రెస్ లోకి తీసుకుంటున్నారని విప్లవ్ ప్రశ్నించడంతో సర్వత్రా హాట్టాపిక్గా మారింది.