చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అదరగొట్టింది. మొదటి మ్యాచ్ లో పటిష్ఠమైన ముంబైను ఓడించిన గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మంగళవారం (మార్చి 26) రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఏకంగా 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది . ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టుకు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 62 పరుగులు సేకరించిన తర్వాత రచిన్ (46 పరుగులు, 20 బంతుల్లో) ఔటయ్యాడు. దీని తర్వాత అజింక్యా రహానే (12) కూడా త్వరగా ఔటయ్యాడు. ఈ దశలో శివమ్ దూబే మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. కేవలం 23 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ 46 పరుగులు చేశాడు. ఈ అద్భుత బ్యాటింగ్తో సీఎస్కే జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. 207 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని చేధించిన గుజరాత్ టైటాన్స్కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 8 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా, వృద్దిమాన్ సాహా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.
బౌలింగ్ లోనూ రాణించిన..
విజయ్ శంకర్ 12 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేసి ఔటయ్యారు. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ చివరి 6 ఓవర్లలో 97 పరుగులు చేయాల్సి వచ్చింది. సాయి సుదర్శన్ (31), ఒమర్ జాహి (11), రషీద్ ఖాన్ (1) వెంటవెంటనే ఔట్ కావడంతో చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.