బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్లను వేరొక చోటుకు తరలించాలని ఇటీవల కొందరు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నీకి శుద్ధి చేసిన నీటిని అందజేస్తామని తెలిపింది. మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంకు 75,000 లీటర్ల శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తామని BWSSB హామీ ఇచ్చింది. BWSSB ప్రకటన ప్రకారం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధికారులు బుధవారం బోర్డు అధ్యక్షుడు డాక్టర్ రామప్రసాత్ మనోహర్ ని కలిశారు.
అన్ని మ్యాచ్ రోజులలో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని అభ్యర్థించారు.స్టేడియం కోసం కావేరి నీరు లేదా బోర్వెల్ నీటిని ఉపయోగించడం లేదు. నీరు దుర్వినియోగం కాకుండా చూసుకోవడం ద్వారా మ్యాచ్లను కొనసాగించేందుకు వీలు కలుగుతుందని మనోహర్ తెలిపారు. ‘KSCA అధికారులు శుద్ధి చేసిన నీటిని కోరారు. శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలన్న వారి అభ్యర్థనను మేము ఆమోదించాం. కబ్బన్ పార్క్లోని మురుగునీటి శుద్ధి కర్మాగారం నుంచి ఐపీఎల్ టోర్నీలకు నీటిని సరఫరా చేస్తాం’ అని మనోహర్ తెలిపారు.
దాదాపు 32 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన చిన్నస్వామి స్టేడియం మార్చి 25న నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. తదుపరి మ్యాచ్లు మార్చి 29, ఏప్రిల్ 2న జరుగుతాయి. తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా ఐపీఎల్ మ్యాచ్లను బెంగళూరు నుంచి తరలించాలని ఇటీవల డిమాండ్లు వినిపించాయి. అదే సమయంలో మ్యాచ్లను తరలించడం అవమానకరమని, అలా చేస్తే నిరసన తెలుపుతామంటూ కొందరు క్రికెట్ అభిమానులు హెచ్చరించారు.









