ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్లో భాగంగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై నారా లోకేశ్ స్పందించారు. కోర్టు ఇచ్చిన తీర్పు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన సీఎం జగన్కి చెంపపెట్టు అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మండిపడ్డారు. ప్రజా ఆకాంక్షల మేరకు త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీని చేపడతామన్నారు. 2018 గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలను నిర్ధారిస్తూ మెయిన్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో 2.30 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రతి ఏటా జనవరి 1నే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని ఫైర్ అయ్యారు. సీఎం అయ్యాక జగన్ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు. టీడీపీ హయాంలో 169 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. వైసీపీ నేతలు, తన బంధువులతో ఏపీపీఎస్సీని నింపేసి వైసీపీఎస్సీగా మార్చేశారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని, సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టాడని విరుచుకుపడ్డారు. చివరికి గ్రూప్-1 పేపర్ల వాల్యూయేషన్ని ఇష్టారాజ్యంగా నిర్వహించి నిరుద్యోగుల ఉసురు పోసుకుందని వ్యాఖ్యానించారు. ప్రజా ఆకాంక్షల మేరకు త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, కోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని నారా లోకేష్ ధీమాను వ్యక్తం చేశారు.