లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది తీరాలన్న పట్టుదలతో ఉంది. అందులో భాగంగా మేనిఫెస్టోలపై ఫోకస్ చేస్తుంది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష నగదును బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘నారీ న్యాయ్’ పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ హామీలను ప్రకటించారు.ఈ నగదును ప్రతి ఏటా పేదల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని వెల్లడించింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50 శాతం కోటా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
*నారీ న్యాయ్ పేరుతో మహిళల కోసం కాంగ్రెస్ హామీలివే*
మహాలక్ష్మి: ఈ పథకం కింద ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదును నేరుగా వారి ఖాతాలోకి బదిలీ
ఆదీ ఆబాదీ-పూరా హక్: కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్
శక్తి కా సమ్మాన్: ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్నభోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు
అధికార్ మైత్రీ : న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతీ పంచాయతీలో ఒక అధికార్ మైత్రీ నియామకం
సావిత్రీబాయి పూలే హాస్టళ్లు: ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్లు రెట్టింపు. ప్రతీ జిల్లాలో కనీసం ఓ హాస్టల్ ఏర్పాటు