AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్: మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Praneet Rao) అలియాస్‌ ప్రణీత్‌కుమార్‌ పంజాగుట్ట (Panjagutta) పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో స్టేట్ మెంట్ (Statement) రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ (Magistrate) ముందు హాజరు పరచనున్నారు. రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు (Police) విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసుల ఎఫ్ఎస్ఎల్‌ (FSL)కు పంపించారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయనున్నారు. గతంలో ప్రణీత్‌రావు వాడిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ వ్యవహారంలో సిటీ పోలీస్‌తో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీస్ బృందాలు రెండు రోజుల పాటు ఎస్ఐబీలో కీలక ఆధారాలు సేకరించాయి. దాదాపు10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్‌ను స్టోర్ చేసినట్టు గుర్తించారు. డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్‌రావు తొలగించారు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రణీత్ రావ్ లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.

కాగా స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్‌ఐబీ)లో విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్‌ ట్యాపింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్టయిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి అతన్ని రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్‌రావు సస్పెన్షన్‌కు ముందు రాజన్న-సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో డీఎస్పీగా పనిచేశారు. సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లోనే డీజీపీ రవిగుప్తా అతణ్ని సిరిసిల్ల జిల్లా హెడ్‌క్వార్టర్స్‌ దాటి వెళ్లకూడదని ఆదేశించారు. తొలుత ప్రణీత్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసుల బృందం సోమవారమే సిరిసిల్లకు చేరుకున్నా.. అతని జాడ దొరకలేదని సమాచారం. అయితే.. సిరిసిల్లలోని శ్రీనగర్‌కాలనీలో అతను అద్దెకు ఉంటున్న ఇంట్లో అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి ప్రకటించారు. ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట ఠాణాలో అతనిని ప్రాథమికంగా విచారిస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతున్నట్లు సమాచారం. విపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్‌ఐబీలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరి మెప్పు కోసం ఫోన్లను ట్యాప్‌ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లలో ఏముంది? అనే కోణాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10