వేం నివాసంలో తండ్రీకొడుకుల సమావేశం
కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్ధం
(అమ్మన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్):
పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మంగళవారం బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, కుమారుడు అమిత్ రెడ్డి భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ను అమిత్ రెడ్డి ఆశిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సోమవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై ఆ జిల్లా నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నల్గొండ ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి, కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి నివాసంలో భేటీ కావటం హాట్ పాటిక్ గా మారింది.