గృహజ్యోతి పథకంలో భాగంగా ఈ నెల 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి సున్నా బిల్లులు ఇస్తున్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడినా.. జీరో బిల్లులు రావటం లేదు. రేషన్ కార్డులు, ఆధార్, విద్యుత్ సర్వీస్ నంబర్లలో తప్పులు ఉండడం, డేటా ఎంట్రీలో లోపాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఆరు గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలుచేసింది. మార్చి నెల నుంచి జీరో బిల్లు ఇస్తోంది. అయితే ఈ పథకానికి అర్హులైనప్పటికీ టెక్నికల్ సమస్యతో పాటు పలు కారణాలతో చాలా మందికి జీరో బిల్లులు రాలేదు. రేషన్, ఆధార్, విద్యుత్ సర్వీస్ నంబర్లలో తప్పులు , డేటా ఎంట్రీలో పొరపాట్ల కారణంగా సమాచార ధ్రువీకరణ జరగలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అర్హులుగా ఉండి జీరో బిల్లులు రానివారు మండల పరిధిలోని MPDO ఆఫీసుకు వెళ్లి మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అర్హత ఉండి పథకం అప్లై కాకపోతే దగ్గర్లోని ఆఫీసుకు వెళ్లి వివరాలు సమర్పిస్తే అర్హుల జాబితాలోకి చేర్చుతామని ప్రభుత్వం ప్రకటించడంతో.. ఇలా పెద్ద ఎత్తున ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం ఉంటే బిల్లు వచ్చినా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టెక్నికల్ సమస్యతో బిల్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదంటోంది ప్రభుత్వం.