హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.
పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదన్న సీఎం రేవంత్.. ఆవేదన వినే వారు లేక ఇబ్బందులు పడ్డారని వాపోయారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని చెప్పారు. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే అన్న సీఎం రేవంత్.. నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని వ్యాఖ్యానించారు. సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలే అని ఆయన స్పష్టం చేశారు.
”మీకు విశ్వాసం కల్పించడానికే మీతో చర్చలు జరిపాం. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్దం.
తెలంగాణలో ఆదాయం పడిపోయింది. ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగింది. మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేసినా మేం ప్రచారం కల్పించుకోలేదు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్ళాం. 11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశాం. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం.
వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరోసారి గవర్నర్ తో మాట్లాడి ప్రొ.కోదండరామ్ ను శాసన మండలికి పంపుతాం. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.