యూపీలోని ఫిరోజాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఎనిమిదేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా గుండెపోటుతో మృతి చెందాడు. చిన్నారి మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు మృతదేహానికి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని నాగ్లా పచ్చియాలో నివాసముంటున్న ధనపాల్ కుమారుడు చంద్రకాంత్ (8) హన్స్ వాహిని పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం కూడా స్కూల్కు వెళ్లాడు. శనివారం లంచ్ టైంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. చంద్రకాంత్ కూడా మిగతా పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో చంద్రకాంత్ పరుగెత్తుతూ అకస్మాత్తుగా నడుం చుట్టూ చేతులేసుకుని కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న ఓ చిన్నారి కేకలు వేయడంతో స్కూల్ సిబ్బంది అక్కడికి చేరుకుని.. చిన్నారిని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో టీచర్లు బాలుడిని హుటాహుటీన ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి చంద్రకాంత్ అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలుడి మరణానికి గుండెపోటు కారణమని వెల్లడైంది. అంత చిన్న వయసున్న బాలుడికి గుండెపోటు రావడం ఏంటని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు కూడా షాక్కు గురయ్యారు. పాఠశాల ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల్లో బాలుడు కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.