హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో మెట్రో రైల్ నిర్మాణం సంబంధించి శుక్రవారం (మార్చి 8న) శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి కులి కుతుబ్షాహీ నుంచి ఇప్పటివరకు పాలించిన వారందరూ హైదరాబాద్ మంచి పేరు తెచ్చేందుకు కృషి చేశారన్నారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఈ సిటీని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరానికి కృష్ణ గోదావరి నీళ్లను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్న ఆయన హైదరాబాద్కు మెట్రో రైలు తీసుకువచ్చే ప్లాన్ చేయడంతో పాటు పనులు ప్రారంభించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐటీ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు.
2050 తెలంగాణ వైబ్రేట్ పేరుతో మాస్టర్ ప్లాన్ :
హైదరాబాద్ అభివృద్ధి కోసం 2050 తెలంగాణ వైబ్రేట్ పేరుతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లండన్లో థీమ్స్ నదిని అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి అక్కడి పరిస్థితిని పరిశీలించినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ఓల్డ్ సీటీ అభివృద్ధి కోసం ఎంఐఎం సహా అందరంతో కలిసి పనిచేస్తామన్నారు.
2028 వరకు ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చేలా చేస్తా :
2028 వరకు ఓల్డ్ సిటీకి మెట్రో వచ్చేలా నేను మాట ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రోడ్డు విస్తరణ కోసం అడిగారని, రూ. 120 కోట్లు అడిగితే.. ఇతర పనులు కూడా చేయాలంటూ రూ. 200 కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పారు. చంచల్ గూడ జైల్ మార్చి అక్కడ పాఠశాలలో కళాశాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే జైలును ఇతర ప్రాంతంలో నిర్మిస్తామని రేవంత్ పేర్కొన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న ఆయన రాజనీతి వేరుగా ఉంటుంది.. డెవలప్మెంట్ వేరుగా ఉంటుందని చెప్పారు. డెవలప్మెంట్ కోసమే తాము అన్ని విధాల పని చేస్తామని స్పష్టం చేశారు.