AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జ‌గ‌మంతా శివోహం.. శైవ క్షేత్రాలు కిట‌కిట‌..

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. ఎపి, తెలంగాణాలోని శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా చినగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.


వేముల‌వాడ‌, కీస‌ర లో ప్ర‌త్యేక అభిషేకాలు
ఇక‌, తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. వరంగల్‌లోని ప్రసిద్ధ ఆలయమైన వేయిస్తంభాల గుడిలో పునర్మిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో పూజలు చేశారు.

వేయి స్తంబాల ఆల‌యంలో భ‌క్త జ‌నం
మహా శివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. అర్ధరాత్రి నుంచే మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరంగల్ వేయిస్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగరంలోని వేయి స్థంబాల దేవాలయం, సిద్దేశ్వరాలయం, కురవి శ్రీ వీరభద్రేశ్వరుడి ఆలయాలుభక్తులతో కిటికిటలాడుతున్నాయి. అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వరాలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఆలయాల్లో అభిషేకం చేసుకునేందుకు తెల్లవారుజామున నుంచి భక్తులు బారులు తీరారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాగారం, ఉపవాసం చేసే వారికొసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10