బీఆర్ఎస్ నేతలు అధికారంతో పాటు ఆలోచన కూడా కోల్పోయారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం తాము పెట్టిన పలు డిమాండ్లకు కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. సింగరేణి సమస్యలను తాము కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్లు ఇంజనీర్లేమీ కాదని, కానీ వారే ఎక్కువ ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్లు డిజైన్ చేయడం వల్లే డ్యామేజ్ అయిందని ఆరోపించారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు అడ్డగోలుగా మాట్లాడవద్దని సూచించారు.
సౌర విద్యుత్ ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతంలో కూడా తాము ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేస్తామన్నారు. సౌర విద్యుత్తో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు అధికారంతో పాటు ఆలోచనా జ్ఞానాన్ని కూడా కోల్పోయారని విమర్శించారు. వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులను కూడా అప్రమత్తం చేశామని, తాము సరైన సమయంలో లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
